సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన స్నేహితుడు, హీరో కమల్హాసన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించనున్న ఈ 169వ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ నిర్మించనున్నారు. రజనీకాంత్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నందున ఈ ప్రాజెక్టును నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే ‘రజనీ–కమల్ సినిమా ఆగిపోయిందన్నది కేవలం పుకారు మాత్రమే.. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి ఏప్రిల్లో అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించలేదు. పైగా రజనీకాంత్ ఈ చిత్రానికి డేట్స్ ఖరారు చేయాల్సి ఉందట. నవంబరులో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. కాగా ఈ చిత్రంలో రజనీతో కమల్ వెండితెరను పంచుకుంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వీరిద్దరూ కలిసి చివరిసారిగా ‘గిరఫ్తార్’ అనే హిందీ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తుండగా, శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నారు.