దర్బార్‌పై రాళ్లు

3 May, 2019 02:38 IST|Sakshi
రజనీకాంత్‌

ఏదో సినిమాలో హీరో అంటాడు ‘అభిమానాన్ని ఆపలేం సార్‌’ అని. నిజమే. అభిమానాన్ని ఆపితే వచ్చేది ఆగ్రహమే. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతున్నారు ‘దర్బార్‌’ చిత్రబృందం. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు రజనీకాంత్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఓ కళాశాలలో జరుగుతోంది.

రజనీకాంత్‌ సినిమా అంటే ఆసక్తి చూపనివారు ఎవరుంటారు? దాంతో అత్యుత్సాహంతో రజనీ ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తున్నారు కొందరు. దీంతో షూటింగ్‌స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చిత్రబృందానికి ఇబ్బందిగా మారింది. దాంతో సూపర్‌ స్టార్‌ని చూడ్డానికి లొకేషన్‌కి వస్తున్న స్టూడెంట్స్‌ను దూరంగా ఉంచాలని భావించింది చిత్రబృందం. మా అభిమానాన్నే అడ్డుకుంటారా? అని ఆగ్రహించిన స్టూడెంట్స్‌ సెట్‌పై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత షూటింగ్‌ లొకేషన్‌ మార్చాలనే ఆలోచనలో ఉందట టీమ్‌.

మరిన్ని వార్తలు