సొంత కూతురిలా చూసుకున్నారు

20 Mar, 2018 05:23 IST|Sakshi
నటి హూమాఖురేషీ

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ కూతురిలా  తనను చూసుకున్నారని చెప్పింది బాలీవుడ్‌ భామ హూమా ఖురేషీ. దక్షిణాది చిత్రసీమలోకి అడుగు పెట్టిన ఉత్తరాది భామలు ఇక్కడ మళ్లీ మళ్లీ నటించాలని ఆశపడుతుంటారు. నటి హుమా ఖురేషీ అలాంటి కోరికనే వ్యక్తం చేస్తోంది. డిల్లీకి చెందిన ఈ బ్యూటీ ధియేటర్‌ ఆర్టిస్ట్‌గా పలు స్టేజీలో నటించి, ఆనక మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత ముంబాయికి చేరిన హుమా ఖురేషీ బుల్లితెర కార్యక్రమాలతో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ దృష్టిలో పడటంతో తన దశ మారిపోయింది.

ఆయన దర్శకత్వంలో నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సేపూర్‌ హింది చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా కొన్ని హింది చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ దర్శకుడు పా. రంజిత్‌ కంట్లో పడింది. అంతే తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కాలా చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కోలీవుడ్‌లో పాపులర్‌ అయిపోయ్యింది. కాలా చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హూమా ఖురేషీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాలా చిత్రంలో నటిస్తున్న సమయంలో రజనీకాంత్‌ నిరాడంబరతను చూసి విస్మయం చెందానంది.

ఆయన  ఒక కూతురిలా తనపై అభిమానం చూపించారని చెప్పింది. రజనీకాంత్‌ ఇంటి నుంచి ఆహారపదార్థాలను  తెప్పించి తనకు విందు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోననీ అంది. అలాగే తమిళ సంస్కృతి, సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని పేర్కొంది. కాలా చిత్రం తనకు కోలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుందనీ, ఆ చిత్రం విడుదలనంతరం మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ చెప్పింది. ఇప్పటికే కొన్ని చిత్రాలలో నటించే విషయమై కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయనీ తెలిపింది. అదే విధంగా కాలా చిత్రం విడుదల తరువాత తాను ముంబాయి నుంచి దక్షిణాదికి మకాం మార్చనున్నాననీ హూమా ఖురేషీ చెప్పింది.
 

మరిన్ని వార్తలు