రూ 700 కోట్ల క్లబ్‌లో 2.ఓ

14 Dec, 2018 10:27 IST|Sakshi

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్‌ రూపొందించిన విజువల వండర్‌ 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్‌ ఫిక్షన్‌ మూవీ రెండు వారాల్లో రూ 700 కోట్లు వసూలు చేసింది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ రూ 700 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి కోలీవుడ్‌ సినిమాగా నిలిచింది.

2.ఓ ప్రపంచవ్యాప్తంగా రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 2.ఓ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శింపబడలేదని చెబుతున్నారు.

ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్‌ డాక్టర్‌ వశీకరణ్‌, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్‌ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు.

మరిన్ని వార్తలు