అభిమానులు షాక్‌ అవుతారు

9 Nov, 2019 03:13 IST|Sakshi
రజనీకాంత్, కమల్‌హాసన్‌

సౌత్‌ స్టార్స్‌ రజనీకాంత్, కమల్‌హాసన్‌ ఒకే వేదికపై కలిశారు. గురువారం కమల్‌ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ– ‘‘నాకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌గారికి నా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. రజనీ, నేను ఒకరు చేసే పనులకు మరొకరం అభిమానులం’’ అని పేర్కొ న్నారు.

అలాగే తనకు నచ్చిన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ మూవీస్‌లో ‘గాడ్‌ఫాదర్, తిరువిళైయాడల్‌æ, హే రామ్‌’ అని రజనీ పేర్కొన్నారు. ‘హే రామ్‌’ చిత్రాన్ని దాదాపు 30సార్లు చూసి ఉంటానని రజనీ పేర్కొనడం విశేషం. ఇక పుట్టినరోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు కమల్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ ఏడాది గోల్డెన్‌ జూబ్లీ ఐకాన్‌గా రజనీకాంత్‌ ఎంపిక అయ్యారని తెలియగానే ఫోన్‌ చేసి అభినందించాను. యాక్టింగ్‌ మొదలుపెట్టిన తొలి ఏడాదే రజనీ ఐకాన్‌గా నిలిచారు.

ఈ గౌరవం రజనీకి 43ఏళ్ల తర్వాత దక్కిందనే చెప్పుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ సినీ కెరీర్‌లో ముందుకు వెళ్లాలని మేం యువహీరోలుగా ఉన్న రోజుల్లోనే నిర్ణయించుకున్నాం. ఓ సందర్భంలో సినిమాలు వదిలేద్దామనుకుంటున్నానని నాతో అన్నప్పుడు సినిమాలు చేయడాన్ని కొనసాగించమని చెప్పింది నేనే. ఎందుకంటే కొందరు నన్ను కూడా సినిమాలు చేయవద్దని చెప్పారని అప్పుడు రజనీకి చెప్పాను. మా వ్యక్తిగత విషయాలను రజనీ, నేను ఏ స్థాయిలో చర్చించుకుంటామో చెబితే అభిమానులు షాక్‌ అవుతారు’’ అన్నారు కమల్‌హాసన్‌.

మరిన్ని వార్తలు