రజనీకాంత్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కోసం ప్లాన్ రెడీ అవుతోంది. కమల్హాసన్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు ‘మా నగరం (2017), ఖైదీ (2019)’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 169వ చిత్రం. ఆల్రెడీ కథా చర్చల్లో భాగంగా రజనీని లోకేష్ రెండుసార్లు కలిశారని సమాచారం. కథ పట్ల రజనీ సుముఖంగానే ఉన్నారట. అలాగే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులుగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలనే విషయంపై కూడా కమల్–లోకేష్ చర్చించుకుంటున్నారట.
ఈ సినిమాని నిర్మించనున్న కమల్ అతిథి పాత్రలోనూ కనిపించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.