దురదృష్టకరం..అలా జరగాల్సింది కాదు: రజినీ

22 Jun, 2019 21:15 IST|Sakshi

సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుకు రేపటితో తెరపడనుంది. ఆదివారం నడిగర్‌ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాండవర్‌ జట్టు, స్వామి శంకరదాస్‌ జట్టులు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నడిగర్‌ సంఘం ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం ముంబైలో ఉన్న ఆయన తన ఆవేదనను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ నేను ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలో ఉన్నాను. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ సాయంత్రం చాలా ఆలస్యంగా 6.45 గంటలకు పోస్టల్‌ ఓటు అందుకున్నాను.

ఈ ఆలస్యం కారణంగా నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాను. ఇది చాలా దురదృష్టకరం. ఇలా జరగాల్సింది కాద’’ని పేర్కొన్నారు. కాగా నడిగర్‌ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్‌ జట్టు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై కోర్టు గత శుక్రవారం విచారణ జరిపింది. యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువరించింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది.

మరిన్ని వార్తలు