రజనీకాంత్‌కు మదురై కోర్టు సమన్లు

8 Mar, 2016 15:44 IST|Sakshi
రజనీకాంత్‌కు మదురై కోర్టు సమన్లు

మదురై: 'లింగా' సినిమా కథ వివాదంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మదురై కోర్టు మంగళవారం సమన్లు జారీచేసింది. తన కథను చౌర్యం చేసి.. 'లింగా' సినిమా కోసం వాడుకున్నారని రచయిత కేఆర్‌ రవి రథినామ్‌ మదురై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రజనీకాంత్‌తోపాటు సినిమా దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, చిత్ర రచయిత బీ పొన్‌కుమార్, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు కోర్టు సమన్లు జారీచేసింది.

ఈ కేసులో ఏప్రిల్‌ 30వతేదీలోగా విచారణ పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు మదురై మున్సిఫ్ కోర్టు జడ్జిని ఆదేశించింది. తన స్క్రిప్ట్‌ను దొంగలించి 'లింగ' సినిమాకు వాడుకున్నారని కేఆర్ రవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన మదురై కోర్టు 2014 డిసెంబర్‌లో సినిమా విడుదలకు ముందే నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు పలు ఆదేశాలు ఇచ్చింది. డిమాండ్ డ్రాఫ్ట్‌గా రూ. 5 కోట్లు, అదనపు గ్యారంటీగా మరో రూ. 5 కోట్లు డిపాజిట్‌ చేయాలని  ఆదేశించింది.