తలైవా@165

24 Feb, 2018 00:20 IST|Sakshi
రజనీకాంత్‌

పక్కా... పొలిటికల్‌ ఎంట్రీకి ముందే రజనీ ఓ సినిమా చేయడం పక్కా అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. ‘కాలా’, ‘2.0’ చిత్రాల తర్వాత రజనీ నెక్ట్స్‌ చిత్రం ఏంటీ? అని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఆయన నెక్ట్స్‌ చిత్రం ఫిక్సైంది. రజనీకాంత్‌ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్‌ సమర్పణలో ఓ సినిమా రూపొందనుంది. ఇది రజనీకాంత్‌ కెరీర్‌లో 165వ సినిమా అట. తలైవా (నాయకుడు)ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కార్తీక్‌ సుబ్బరాజుకు దక్కడం ఊహించని విషయమని అంటున్నారు కోలీవుడ్‌వాసులు. ‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. తలైవాతో సినిమా చేయాలనే నా  కల నిజమైంది. తలైవాకి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు కార్తీక్‌ సుబ్బరాజు.

‘పిజ్జా, జిగర్‌దండా, బెంచ్‌ టాకీస్, ఇరైవి, ‘మెర్క్యురీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు కార్తీక్‌ సుబ్బరాజు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సైలెంట్‌ థ్రిల్లర్‌ ‘మెర్క్యురీ’ ఏప్రిల్‌ 13 రిలీజ్‌ కానుంది. ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ‘కాలా’ చిత్రం ఏప్రిల్‌ 27న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీపావళికే విజయ్, సూర్య, అజిత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌’ సినిమాలు షెడ్యూల్‌ అయిన సంగతి తెలిసిందే. సో.. దీపావళికి గట్టి పోటీ అన్నమాట.

>
మరిన్ని వార్తలు