‘లింగా’ ఫీవర్

13 Dec, 2014 02:55 IST|Sakshi
‘లింగా’ ఫీవర్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం విడుదలతో శుక్రవారం రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు, ముఖ్యంగా రజనీ అభిమానులు లింగా ఫీవర్‌తో తపించిపోయారు. రజనీ కటౌట్లను పాలతో ముంచేశారు. ఆలయాల్లో పూజలు నిర్వహించారు.          
 
* అర్ధరాత్రి నుంచే ప్రదర్శనలు
* రజనీ కటౌట్లకు పాలాభిషేకాలు
* ఆలయాల్లో ప్రత్యేక పూజలు
* కాశీ థియేటర్‌పై దాడి

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒకప్పుడు ఎంజీఆర్.. ప్రస్తుతం రజనీ.. నాడునేడు ఆ మూడక్షరాలు చెబితేనే సినీ ప్రేక్షకులు ఊగి పోతారు. అభిమానులైతే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. మూడేళ్ల విరామం తరువాత అత్యధిక అంచనాలతో లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రజనీ అభిమానులు గురువా రం అర్ధరాత్రి నుంచి థియేటర్లకు చేరుకున్నారు. థియేటర్ల ముందున్న కటౌట్లకు పాలాభిషేకం చేశారు. సీట్లు పంచారు.

బాణా సంచా కాల్చారు. సిని మా విజయవంతంగా కావాలని మొక్కుకుంటూ గొర్రెలను బలిచ్చారు. డప్పులు, మేళతాళాలు వా యిస్తూ చిందులు వేశారు. అభిమానులతో కొందరు మహిళలు సైతం కాలుకదిపారు. పుదుచ్చేరీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రాని ప్రదర్శించారు. సేలం లో 14 థియేటర్ల వద్ద పాలాభిషేకం చేశారు. నెల్లైలో రాత్రి 12 గంటలకు జనం క్యూలో నిలుచున్నారు.

తిరుచ్చీలోని 12 థియేటర్ల వద్ద రజనీ కటౌట్లపై పూలవర్షం కురిపించి పండ్లు పంచిపెట్టారు. వేలూరులో 27 థియేటర్లలో విడుదల కాగా అక్కడ ప్రత్యే క పూజలు నిర్వహించారు. తేనీ జిల్లాలో రాత్రి 12 గంటలకే లింగా చిత్రాన్ని ప్రదర్శించారు. కోవైలో తెల్లవారుజాము 4 గంటలకే సినిమా హాళ్లన్నీ నిండిపోయా యి. సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో 25 థియేటర్లలో సినిమాను ప్రదర్శించలేదు. రజనీకి ఇ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెన్నై తపాలాశాఖ డైరక్టర్ తెలిపారు.
 
నిరాశ
ప్రతి జన్మదినం రోజున చెన్నై పాయిస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకోవడం రజనీకాంత్‌కు అనవాయితీ. అయితే ఈ సారి అభిమానులకు నిరాశే మిగిలింది. శుక్రవారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అభిమానులు, యువతులు సైతం రజనీ ఇంటికి బయలుదేరగా మార్గమధ్యం లోనే పోలీసులు నిలిపివేశారు. అభిమానులు అక్కడే రజనీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి వెళ్లిపోయారు. నగరంలో మరో చోట రజనీ అభిమానులు పాలకుండలతో ఊరేగింపు నిర్వహించి ఆ తరువాత అమ్మవారికి పాలాభిషేకం జరిపారు. రజనీ జన్మదినాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అఖిలభారత రజనీ అభిమానుల సంఘం నిర్వాహులు రామరాజు, సూర్య, రవి తెలిపారు.
 
మోదీ, కరుణ శుభాకాంక్షలు
రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ, డీఎంకే అధినేత కరుణానిధి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూరేళ్లు జీవించాలని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
కాశీ థియేటర్‌పై దాడి
లింగా ప్రదర్శనలో జాప్యం జరగడంతో తట్టుకోలేని రజనీ అభిమానులు చెన్నై ఎంజీఆర్ నగర్‌లోని కాశీ థియేటర్‌పై దాడికి దిగారు. గురువారం అర్ధరాత్రికే థియేటర్ వద్దకు చేరుకున్న అభిమానులు కేక్ కట్‌చేసి రజనీ జన్మదిన వేడుకలు జరిపారు. శుక్రవారం తెల్లవారుజాము 1 గంటకే చిత్రం ప్రదర్శిస్తామని ప్రకటించిన థియేటర్ యాజ మాన్యం 2 గంటలవుతున్నా మిన్నకుండిపోయింది. ఓర్పు నశించిన అభిమానులు థియేటర్ ముందుభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. మరి కొందరు రాళ్లురువ్వి గందరగోళం సృష్టించారు. పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులకు సర్దిచెప్పారు.  ఆ తరువాత సినిమా ప్రారంభమైంది.