‘మున్నాభాయ్‌’ మళ్లీ వస్తున్నాడు!

21 May, 2018 09:14 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ మరోసారి సీక్వెల్‌ బాట పట్టారు. గతంలో వచ్చిన ‘మున్నాభాయ్‌’, 'లగేరహో మున్నాభాయ్‌'లకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్‌దత్‌ బయోపిక్‌ ‘సంజు’ సినిమాతో బిజీగా ఉన్న హిరానీ, ఆ తర్వాత తెరకెక్కించే చిత్రం మున్నాభాయ్‌ సిరీస్‌లో ఉండనుందని ప్రకటించారు. సంజు ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘మున్నాభాయ్‌ ఛలో అమెరికా’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు, కొన్ని కథలు కూడా పరిశీలిస్తున్నట్లు హిరానీ తెలిపారు. అయితే స్క్రిప్ట్‌ ఇంకా పూర్తికాలేదని ఆయన వెల్లడించారు.

ఇదే విషయంపై సంజయ్‌ దత్‌ మాట్లాడుతూ.. ‘మున్నాభాయ్‌ మూడోపార్ట్‌ ఉంటుంది. కానీ అది మున్నాభాయ్‌​ ఛలో అమెరికా కాకపోవచ్చు. ఎందుకంటే నేను అమెరికా వెళ్లేందుకు వీసాను పొందలేనంటూ చమత్కరించారు. హిరానీ తన ప్రస్తుత చిత్రం సంజు పూర్తయిన వెంటనే మున్నాభాయ్‌ స్ర్కిప్ట్‌ను పూర్తి చేస్తారు. అన్ని కలిసొస్తే వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కావొచ్చ’ని సంజూ తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవి ఈ సిరీస్‌లోని రెండు చిత్రాలను శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, శంకర్‌ దాదా జిందాబాద్‌ పేరుతో రీమేక్‌ చేశారు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించారు.

మరిన్ని వార్తలు