త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

14 Jun, 2019 08:28 IST|Sakshi

 వర్మతో మరిన్ని సినిమాలు తీస్తా

‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ నిర్మాత రాకేశ్‌రెడ్డి  

సాక్షి బెంగళూరు: ‘రామ్‌గోపాల్‌వర్మ ఉన్నది ఉన్నట్లుగా సినిమాల్లో చూపించే వ్యక్తి. సినిమాల్లో వాస్తవాలు చూపించడంలో తనకు తానే సాటి. త్వరలోనే కేసీఆర్, జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమాలు సిద్ధం చేస్తాం’ అని లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు ఆనందంతో ఇంటికి వెళ్లాలి.. కానీ అసంతృప్తిగా కాదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాకేశ్‌రెడ్డి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. పలమనేరు నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పని చేశారు. రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాల్లో ఉన్నారు. రెండు పడవల ప్రయాణం వద్దని వ్యాపారాల మీద దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. వివరాలు..

చిన్ననాటి నుంచే ఆసక్తి
బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. ఆరంభంలోనే అదిరిపోయే సినిమా నిర్మించాలని భావించాను. ఈ క్రమంలో ఎన్‌టీఆర్‌ జీవిత కథ ఆధారంగా వాస్తవాలను జనాలను చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఫలితంగా పాత పరిచయాల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో కలిసి లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ బయోపిక్‌ గురించి చర్చించాం. వాస్తవాలను తెరకెక్కించాలంటే రామ్‌గోపాల్‌వర్మతోనే సాధ్యం.
నిర్మాతలతో చాలా చక్కగా ప్రవర్తించే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. నిర్మాతల బాధలను అర్థం చేసుకునే వ్యక్తి వర్మ. మా బ్యానర్‌లో వచ్చే మరో రెండు సినిమాలు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే కొనసాగిస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథలను ఎంచుకున్నాం.
ట్రైలర్‌ విడుదల సమయంలోనే ఆదరించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో.. అదే తరహాలో లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ సినిమా హైప్‌ క్రియేట్‌ అయింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

మరిన్ని వార్తలు