నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు

1 Nov, 2018 09:09 IST|Sakshi

తనుశ్రీ నుంచి నష్టపరిహారం కోరిన రాఖీ సావంత్‌

మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండగా.. బాలీవుడ్‌ నటీమణులు తనుశ్రీ దత్తా రాఖీ సావంత్‌ల మధ్య వివాదం రోజురోజుగా రాజుకుంటోంది. ‘తనుశ్రీ దత్తా డ్రగ్స్‌ బానిస, ఆమె ఒక లెస్బియన్‌’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాఖీపై తనుశ్రీ ఇప్పటికే రూ.10 కోట్లకు దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరారు. (తనుశ్రీకి పిచ్చి పట్టింది)

‘ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉన్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరింత కష్టాల్లో పడలేను. కానీ, ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న నా పరువూ, మర్యాదలను తనుశ్రీ నాశనం చేయాలని చూస్తోంది. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా వేశాను’ అని రాఖీసావంత్‌ చెప్పుకొచ్చారు. కాగా, డబ్బు సంపాదన కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందనీ, ఎలాంటి నీచమైన పనులైనా చేస్తుందని తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

వివాదం మొదలైందిలా..
బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమానికి  బీజం పడిన సంగతి తెలిసిందే. అయితే, మీటూ ఆరోపణలపై బాలీవుడ్‌ నటీమణులు కొందరు తనుశ్రీకి మద్దతు తెలపగా నటి రాఖీ సావంత్‌ మాత్రం తీవ్ర విమర్శలు చేసింది. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించింది. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (‘నేను లెస్బియన్‌ని కాదు’)

అంతటితో ఆగకుండా ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్‌ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తనుశ్రీ వేసిన దావాపై రాఖీ స్పందించకపోతే ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాది నితిన్ మీడియాతో వెల్లడించారు.

మరిన్ని వార్తలు