వరుస పరాజయాలు.. పారితోషికం మాత్రం డబుల్‌

8 Mar, 2019 10:52 IST|Sakshi

ఒక్క సక్సెస్‌ వస్తే చాలు హీరోహీరోయిన్లు తమ పారితోషికాలను అమాంతం పెంచేస్తుంటారు. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటీనటుల పారితోషికాలను చూస్తుంటే మతిపోతోంది. హీరోలు రూ.40 కోట్లకు పైనే డిమాండ్‌ చేస్తుంటే హీరోయిన్లు తామేమీ తక్కువ కాదు అన్నట్టుగా రూ.10 కోట్లకు పైనే పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లు రూ.12 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో భారీ పారితోషికం పుచ్చుకుంటున్న నటి నయనతారనే. ఈ సంచలన నటి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. అనుష్క రూ.3 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌. ఇక పెద్దగా మార్కెట్‌ లేని హీరోయిన్లు రూ.50 నుంచి 60 లక్షల వరకూ పుచ్చుకుంటున్నారు.

మొన్నటి వరకూ కోలీవుడ్‌లో హిట్‌ కోసం పడిగాపులు పడ్డ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ మధ్య కార్తీతో జత కట్టిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’ చిత్ర విజయంతో కోటి వరకూ పారితోషికాన్ని డిమాండ్‌ చేసింది. ఇటీవల మరోసారి కార్తీతో రొమాన్స్‌ చేసిన ‘దేవ్‌’ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా మరోసారి పారీతోషికాన్ని పెంచేసిందట రకుల్‌. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్యకు జంటగా నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కి పెద్దగా అవకాశాలు లేవు. అయినా తెలుగులో నాగార్జునకు జంటగా నటించే చిత్రం కోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికానికి మరో సగం పెంచేసి రూ.1.50 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. మరో విజయం సాధించేవరకూ ఇదే పారితోషికాన్ని మెయిన్‌టేన్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు