ఎంత కష్టం!

25 Sep, 2018 04:06 IST|Sakshi
కార్తీ

సినిమాకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి షూటింగ్‌ లొకేషన్లో ఏర్పడే మనస్పర్థల వల్ల, ఆర్టిస్టుల డేట్స్‌ విషయంలోనూ, ప్రకృతి వల్ల కూడా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అనూహ్య ఇబ్బందిలోనే చిక్కుకుంది ‘దేవ్‌’ టీమ్‌. కార్తీ, రకుల్‌ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూమనాలిలో ప్లాన్‌ చేసి, యూనిట్‌ అక్కడకు చేరుకుంది. సడెన్‌గా కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చాయి. దాంతో షూటింగ్‌ ప్రదేశమంతా బీభత్సంగా తయారవ్వడంతో పాటు సుమారు 140 మంది యూనిట్‌ మెంబర్స్‌ అక్కడ చిక్కుకుపోయారట.

ఈ విషయాన్ని కార్తీ షేర్‌ చేస్తూ – ‘‘మంచు పడుతున్న సీన్స్‌ షూట్‌ చేద్దామని హిమాచల్‌ ప్రదేశ్‌ వచ్చాం. మాకు అనుగుణంగానే లొకేషన్‌ ఉండటంతో షూటింగ్‌ సజావుగా జరుగుతుందనుకున్నాం. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది.  కొండ మీదున్న రాళ్లు జారి రోడ్డు  మీద పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. షూటింగ్‌ లొకేషన్‌లో (కొండ మీద) చిక్కుకుపోయిన వాళ్లతో కమ్యూనికేషన్‌ లేదు. సేఫ్టీ కోసం నన్ను కొండ కింద ఊర్లోనే ఉండ మన్నారు’’ అన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నిర్మాతకు సుమారు కోటిన్నరకు పైనే నష్టం మిగిల్చిందట. అలాగే గత  23 ఏళ్లలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇంతటి బీభత్సాన్ని చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు