వదంతులు ప్రచారం చేస్తున్నారు : రకుల్‌

23 Mar, 2019 09:56 IST|Sakshi

తనను ఎవరూ అడ్డుకోలేరు అంటోంది నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. సినిమా ఎవరిని ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళుతుందో, ఎవరిని ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు. ఇవాళ అవకాశాలు లేని వారు రేపు చేతినిండా చిత్రాలతో బిజీ అవ్వొచ్చు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఈ అమ్మడు మొదట్లో కోలీవుడ్‌లో ఐరన్‌లెగ్‌గా ముద్ర వేసుకుంది. కానీ టాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యింది. వరుస పెట్టి యంగ్‌ స్టార్స్‌తో నటించేసింది. అంతే టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకుంది.

ఆ క్రేజ్‌తో మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసింది. తాజాగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్లాప్‌లు వెంటాడాయి. ముఖ్యంగా తమిళంలో కార్తీతో రెండోసారి రొమాన్స్‌ చేసిన దేవ్‌ చిత్ర ఫ్లాప్‌ ఆమె కెరీర్‌కు పెద్ద ఎఫెక్ట్‌ అయ్యింది. దీంతో కొత్త అవకాశాలేమీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ దరిదాపులకు కూడా రావడం లేదు. ప్రస్తుతం సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం, శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న మరో చిత్రాలనే నమ్ముకుంది. అంతే కాదు టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల కారణంగా అంగీకరించిన చిత్రాలు కూడా చేజారుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్‌ పారితోషికం పెంచిందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. అయితే రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం ఇలాంటి ప్రచారాన్ని పట్టించుకోనక్కర్లేదు అంటోంది. దీని గురించి తను చెబుతూ తన గురించి ఎన్ని కట్టుకథలను ప్రచారం చేసినా తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. బహు భాషా నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ నటిస్తోంది. అక్కడ అక్షయ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది.

మూడు భాషల్లో నటించే అతి కొద్ది మందిలో తాను ఒకరిని కావడం సంతోషంగా ఉందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంది. అయితే తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవని, అయినా అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంది. తాజాగా ఈ అమ్మడికి తెలుగులో నాగార్జునకు జంటగా మన్మథుడు 2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందన్న టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు