రెండోసారి?

9 Dec, 2018 05:41 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సుకుమార్‌, మహేశ్‌బాబు

మహేశ్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా పలు పేర్లు పరిశీలిస్తున్నారు చిత్రబృందం. తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని దర్శకుడు సుకుమార్, మహేశ్‌ కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు సుక్కూ. ఇటీవలే మహేశ్‌కు ఈ స్క్రిప్ట్‌ కూడా వినిపించారట.

‘1: నేనొక్కడినే’ తరహా థ్రిల్లర్‌లా ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతోందని సమాచారం. ఇందులో మహేశ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఆల్రెడీ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’లో రకుల్‌ హీరోయిన్‌గా నటించారు. అలాగే మహేశ్‌ ‘స్పైడర్‌’ సినిమాలో మహేశ్‌తోనూ జోడీ కట్టారు రకుల్‌. సో అటు దర్శకుడు సుకుమార్‌తో, మహేశ్‌తో రకుల్‌కు రెండో సినిమా అవుతుంది ఇది. అలాగే సుకుమార్, మహేశ్‌కి కూడా ఇది రెండో సినిమా.  మహేశ్‌తో ‘శ్రీమంతుడు’  వంటి హిట్‌ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్‌. సో.. ఈ సంస్థకూ, మహేశ్‌కూ ఇది రెండో సినిమా అవుతుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుక్కూతో చేయబోయే చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరిన్ని వార్తలు