టమాటే.. ఆలూయే.. గోబీయె!

8 Feb, 2016 10:48 IST|Sakshi
టమాటే.. ఆలూయే.. గోబీయె!

కూరగాయలు అమ్మడం చిన్న విషయం కాదు. టమాటే.. ఆలూయే.. గోబీయె.. అంటూ కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకోవడం కోసం పెట్టే కేకలకు చాలా ఎనర్జీ ఉండాలి. ఇది అలవాటు లేని పనే అయినా రకుల్ ప్రీత్‌సింగ్ చాలా ఓపికగా, ఎనర్జిటిక్‌గా కూరగాయలు అమ్మేశారు. దీనికో కారణం ఉంది. ఓ ప్రముఖ టీవీ చానల్ ‘మేము సైతం’ పేరుతో ఓ షో చేయనుంది. దీనికి మంచు లక్ష్మీప్రసన్న హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ మాల్ ఎదురుగా రకుల్ ప్రీత్ కూరగాయలు అమ్మారు.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘లక్ష్మీ మంచు షో కోసం కూరగాయలు అమ్మబోతున్నా. అందరూ వచ్చి కూరలు కొనుక్కోవచ్చు’’ అని ముందుగానే రకుల్ ప్రకటించారు. ఈ బ్యూటీ కూరగాయలు అమ్మడాన్ని  కొంతమంది విచిత్రంగా చూస్తే, కుర్రకారు మాత్రం మురిపెంగా చూశారు.