ఆశలన్నీ ఆ రెండింటి పైనే..! : నటి

17 Jul, 2017 08:26 IST|Sakshi
ఆశలన్నీ ఆ రెండింటి పైనే..! : నటి

బహుభాషా నటీనటులుగా పేరుతెచ్చుకుంటే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా అలాంటి హీరోయిన్లకు డిమాండ్‌ పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నటి నయనతార, అనుష్క, తమన్నా, కాజల్‌అగర్వాల్, సమంత వంటి తారలింకా అగ్రనాయికలుగా రాణించడానికి ఇదే కారణం. ఒక భాషలో అవకాశాలు తగ్గు ముఖం పట్టినా మరో భాషలో చేతి నిండా చిత్రాలుంటాయి. ఇప్పుడు నటి రకుల్‌కు అందని స్థాయి ఇదే. తొలుత కోలీవుడ్‌కే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు మూడు చిత్రాల్లో నటించినా ఆదరణ లభించలేదు.

దీంతో పొరుగు భాష తెలుగులో దృష్టి సారించి అక్కడ సక్సెస్‌ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నా, కోలీవుడ్‌లో గెలవలేక పోయాననే చింత వెంటాడుతూనే ఉందట. తాజాగా కోలీవుడ్‌లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఏఆర్‌.మురుగదాష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో మహేశ్‌బాబుతో రొమాన్స్‌ చేస్తోంది. మధ్యలో విశాల్‌కు జంటగా మిష్కిన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా దాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం పోయిందన్న బాధను మరచిపోయేలా కార్తీతో ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో అవకాశం వరించింది.

చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా పోలీస్‌ పాత్రలో కనిపించనుందట. కాగా ఈ రెండు చిత్రాలతోనే కోలీవుడ్‌లో తన భవిష్యత్‌ ఆధారపడి ఉందని రకుల్‌ ప్రీతిసింగ్‌ భావిస్తోందట. ఇక్కడ కూడా ఒక మంచి హిట్‌ వస్తే మరో కొన్నేళ్లు అగ్రనాయకిగా లాగించేయవచ్చన్నది ఈ అమ్మడు కలలు కంటోందట.