కోలీవుడ్‌పై రకుల్‌ గురి

5 Aug, 2017 00:53 IST|Sakshi
కోలీవుడ్‌పై రకుల్‌ గురి

తమిళసినిమా: రకుల్‌ప్రీత్‌సింగ్‌ తాజాగా కోలీవుడ్‌పై గురిపెట్టినట్లుంది. టాప్‌ హీరోయిన్‌గా నిరంతరం కొనసాగడం ఎవరికీ సాధ్యం కాదు. తాజాగా ఆ రేంజ్‌కు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  టాలీవుడ్‌లో ప్రముఖ నాయకి స్థాయికి చేరుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ అక్కడ యువ స్టార్స్‌ అందరితోనూ నటించేసింది. అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌తేజ, నాగచైతన్య లాంటి హీరోలతో హిట్స్‌ కొట్టేసింది.

ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలతో త్వరలో తెలుగు, తమిళం భాషల్లో తెరపైకి రానున్న స్పైడర్‌ చిత్రంలో నటించిన రకుల్‌ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ భామకు స్పైడర్‌ రీఎంట్రీ చిత్రం అవుతుంది. నిజానికి తొలుత కోలీవుడ్‌లోనే రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఎంట్రీ అయ్యింది. ఇక్కడ తడయార తాక్క, పుత్తగం, ఎన్నమో ఏదో చిత్రాల్లో నటించింది. అయితే వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో అమ్మడిని పక్కన పెట్టేశారు.

దీంతో టాలీవుడ్‌కు జంప్‌ చేసి అక్కడ వరుస సక్సెస్‌లను అందుకుంటూ టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది. తాజాగా కోలీవుడ్‌పై కన్నేసినట్లుంది. ఇక్కడిప్పుడు స్పైడర్‌తో కలిపి నాలుగు భారీ చిత్రాలు రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేతిలో ఉన్నాయి. స్పైడర్‌ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతుండగా తాజాగా కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు, సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య సరసన ఒక చిత్రం ఇప్పటికి కమిటైన చిత్రాలు.

వీటిలో కార్తీతో నటిస్తున్న ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ దశలో ఉండగా, సూర్యతో రొమాన్స్‌ చేసే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక వీటితో పాటు ఇళయదళపతి విజయ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మెర్శల్‌ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. తదుపరి ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. దీంతో తదుపరి టాప్‌ హీరోయిన్‌ స్థాయికి రకుల్‌ప్రీత్‌సింగ్‌ గురిపెట్టినట్లు చెప్పవచ్చు.