‘రేయ్’కి తెరవెనుక రామ్

22 Apr, 2014 23:42 IST|Sakshi
‘రేయ్’కి తెరవెనుక రామ్

పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు కలిసి నటించలేదు కానీ, ప్రేక్షకులకు మాత్రం ‘జల్సా’ సినిమాతో ఓ సరికొత్త కిక్ ఇచ్చారు. పవన్‌కల్యాణ్ నటించిన ఆ సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ చెప్పడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఆ తర్వాత అలాంటి సంచలనాలు చాలానే జరిగాయి. ఎన్టీఆర్ ‘బాద్‌షా’కి మహేశ్, మర్యాద రామన్న, దూసుకెళ్తా చిత్రాలకు రవితేజ, ‘రేసుగుర్రం’కి సునీల్... నేపథ్య గళాన్ని అందించారు. ఇటీవలి కాలంలో ఈ జాబితా అధికమైంది. హీరోల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఈ వాయిస్‌ఓవర్ కొత్త ట్రెండ్‌కి నాంది పలుకుతోంది.
 
 తాజాగా హీరో రామ్ కూడా ఈ జాబితాలో చేరారు. సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్’ చిత్రానికి రామ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ- ‘‘‘రేయ్’లో కొన్ని ముఖ్య సన్నివేశాలకు వాయిస్ ఓవర్ అవసరమైంది. రామ్‌ని అడగ్గానే వెంటనే ఓకే అన్నాడు. తన వాయిస్ ఓవర్ చాలా బాగా వచ్చింది. మే 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: యలమంచిలి గీత.