మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే చరణ్ షూటింగ్ చేస్తున్న ప్రాంతాల్లో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కి పలుమార్లు అంతరాయం ఏర్పడింది.
చరణ్ మాత్రం షూటింగ్ పాటు అభిమానులతో కలిసి మాట్లాడేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అభిమానులతో మాట్లాడిన చరణ్ 'ఖైదీ నంబర్ 150' సినిమా ఘన విజయం సాధించింది అంటే కారణం ప్రేక్షకాభిమానులే. 100 రోజులు సినిమా ఆడటం అనేది ఎప్పుడో పోయింది. కానీ 'ఖైదీ నంబర్ 150' 100 రోజులు ఆడింది. అది మీవల్లే. నాన్నగారి 151వ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వరకూ ఆయన ఇలాంటి పాత్రలో కనిపించలేదు. ఓ గొప్ప పాత్రలో కనిపించబోతున్నారు.
భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. కచ్ఛితంగా పెద్ద విజయం సాధిస్తుంది. అలాగే నా 'ధృవ' సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పుడు దేశం డీమానిటైజేషన్ సమస్యలో ఉంది. అలాంటి సమయంలో కూడా భారీ వసూళ్లు వచ్చాయి అంటే కారణం అభిమానులే. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. బాబాయ్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన సమ్మర్ను సైతం లెక్క చేయకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు.
బాబాయ్ ఏ కార్యక్రమం చేసినా ఆయన వెన్నంటే ఉండాలి. రాజకీయ పరంగానైనా..ఇంకేదైనా. భారతదేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మేము ఇంత ఎత్తుకు ఎదిగామంటే కారణం మీరే. నేను హైదరాబాద్లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని అలరించాలనే క్లిష్టపరిస్థితులు ఎదురైనా సినిమా షూటింగ్ కోసం నిరంతరం కష్టపడుతున్నాం.
నా సినిమా విషయానికి వస్తే .. సుకుమార్ చాలా మంచి కథ చెప్పారు. కథ, కథనాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందుకే సినిమాకు కమిట్ అయ్యా. మీ అందర్నీ అలరించే విధంగా సినిమా ఉంటుంది. అంటూ అభిమానులతో తన సినిమా విశేషాలను పంచుకున్నాడు చరణ్.