డేట్‌ ఫిక్స్‌?

18 Jul, 2018 00:34 IST|Sakshi

సంక్రాంతి పండక్కి థియేటర్స్‌లోకి వస్తానన్నారు రామ్‌చరణ్‌. అందుకు తగ్గట్లుగానే ఆయన సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. తాజా షెడ్యూల్‌ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందట.

ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. బోయపాటి సినిమా అంటే యాక్షన్‌ భారీగా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్‌ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చిత్రం ఇంట్రవెల్‌ సీన్‌లో భారీ ఫైట్‌తో పాటు వచ్చే ఓ సూపర్‌ ట్విస్ట్‌ ప్రేక్షకులను ఆశ్యర్యపోయేలా చేస్తుందట. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ప్రకటించింది. కానీ అధికారిక తేదీని వెల్లడించలేదు. వచ్చే ఏడాది జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పంద్రాగస్టుకి ఈ సినిమా టైటిల్‌ అండ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల కానున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు