‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌?

7 Dec, 2019 18:24 IST|Sakshi

అన్నీ కుదిరితే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించే అవకాశం ఉంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకొని ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్‌. అయితే ఈ ఫంక్షన్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అనుకుంటున్నారట. మహేశ్‌తో రామ్‌చరణ్‌కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఈవెంట్‌కు అతడినే ఆహ్వానించాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కూడా ఈ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు.    

ఫైల్‌ ఫోటో

గతంలో మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’మూవీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ కూడా హాజరుకావాల్సింది. కానీ చివరి నిమిషంలో రాలేకపోయాడు. అయితే ఫంక్షన్‌ అనంతరం ఓ స్టార్‌ హోటల్లో మహేశ్‌,ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలుసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’కోసం రామ్‌చరణ్‌ స్పందించినట్టు టాక్‌. అన్ని కుదిరితే సూపర్‌స్టార్‌-మెగాపవర్‌ స్టార్‌లు ఒకే వేదికపై కనిపించనున్నారు. 

మహర్షి వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత మహేశ్‌ చేస్తున్న చిత్రం కావడంతో పాటు క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అభిమానుల్లో మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ భారీగానే ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసింది. అంతేకాకుండా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్‌ చేయనుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. 

కాగా, ఈ చిత్రంలో  రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో దాదాపు దశాబ్దం తర్వాత లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు