చాలు.. ఇక చాలు అనిపించింది

4 Oct, 2019 02:56 IST|Sakshi
జగపతిబాబు, సురేందర్‌ రెడ్డి, రామ్‌చరణ్, చిరంజీవి, తమన్నా, సుస్మిత

– చిరంజీవి

‘‘సైరా’ సినిమా విడుదలకు  నెలన్నర ముందు నుంచి తెల్లవారుజాము 3.30 ప్రాంతంలో ఉలిక్కిపడి నిద్రలేచేవాణ్ణి. అది ఎందుకో తెలియదు. బహుశా మన తెలుగు సినిమా నిర్మాతలందరూ అలాగే లేస్తారేమో తెలియదు’’ అన్నారు ‘సైరా’ చిత్రనిర్మాత రామ్‌చరణ్‌. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మించిన చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘థ్యాంక్స్‌ టూ ఇండియా’ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ పైనుండి మమ్మల్ని ఆశీర్వదించి నాన్నగారితో ఇంత గొప్ప సినిమా తీసే అవకాశం ఇచ్చారేమో. ఇది భారతీయులు గర్వపడే సినిమా’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ కథ పరుచూరి బ్రదర్స్‌ బిడ్డ.  ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సురేందర్‌ రెడ్డితో చెప్పాం. కథ ఏ విధంగా చెప్పారో అదే కథను ఓ ఎపిక్‌లా తెరమీద చూపించినందుకు హ్యాట్సాఫ్‌ టు సురేందర్‌. నేను ఎప్పుడూ ఏ కథ విన్నా నాతోపాటు ఓ స్క్రిప్ట్‌ డాక్టర్‌ ఉంటారు. ఆయనే సత్యానంద్‌గారు. ఆయనకు థ్యాంక్స్‌.

సాయిమాధవ్‌గారు చక్కని మాటలను అందించారు. అమితాబ్‌గారు స్పెషల్‌ ఫ్లైట్‌లో వచ్చి మాకు ఎలా కావాలో అలా అద్భుతంగా నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో చేశారు కాబట్టే ఈ రోజున ‘సైరా’ అందరితో ‘వావ్‌’ అనిపించుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  మొట్టమొదటి స్వాతంత్య్ర సమర యోధుడు అనే సంగతి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా విడుదల చేశాం. ఈ సినిమా ప్రీమియర్‌ను ఒకటో తారీఖున ముంబైలో మీడియాకి వేశాం.

అక్కడ సినిమా చూసినవారందరూ సౌత్‌లో ఇంతమంచి నాయకుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయి,  స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారట. ఇది సౌత్, నార్త్‌ సినిమా కాదు.. ఇండియన్‌ సినిమా అంటున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటుంటే చాలు.. ఇక చాలు! ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనిపించింది’’ అన్నారు. సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప హిస్టారికల్‌ ఫిల్మ్‌ను తీసే చాన్స్‌ ఇచ్చినందుకు చిరంజీవిగారికి, రామ్‌చరణ్‌కి రుణపడి ఉంటాను’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్‌ సినిమా కలెక్షన్లను గ్రాస్‌లో చెబుతారు. తెలుగులో షేర్‌ను మాత్రమే చెప్పేవాళ్లం. ఫస్ట్‌ టైమ్‌ తెలుగు సినిమా 85 కోట్లు వసూలు చేసిందని గ్రాస్‌లో కలెక్షన్లను చెబుతున్నాం. ఇది అమేజింగ్‌ ఫిగర్‌. చిరంజీవిగారిని కలిసినప్పుడు ఎంత కలెక్ట్‌ చేస్తుందని కాదు రాజూ.. ఇది రెస్పెక్టెడ్‌ మూవీ, ఆ గౌరవాన్ని కాపాడాలి అన్నారు’’ అని చెప్పారు. ‘‘చిరంజీవిగారు తన తర్వాతి సినిమాల్లో కూడా నన్ను తీసుకోవాలి’’ అన్నారు తమన్నా. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, రత్నవేలు, బుర్రా సాయిమాధవ్, కమల్‌కణ్ణన్, జగపతిబాబు, సుస్మిత, విద్య తదితరులు పాల్గొ న్నారు.

మరిన్ని వార్తలు