నడి రోడ్డు మీద ప్రెస్‌ మీట్‌: వర్మ

28 Apr, 2019 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే తాజాగా ప్రెస్‌ మీట్‌ విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు వర్మ ట్విటర్‌లో తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ‘నోవాటెల్‌ హోటల్‌ వాళ్లకు ఎవరో వార్నింగ్‌ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా మనందరికీ తెలిసి ఒక వ్యక్తి భయంతో హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పారిపోయార’ని వర్మ పేర్కొన్నారు. 

అదే విధంగా ‘మీడియా మిత్రులకి, ఎన్‌టీఆర్‌ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతివారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానమ’ని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని వర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు