దేవునిపై నమ్మకంతోనే తిరుమలకు: వర్మ

19 Oct, 2018 11:19 IST|Sakshi

తిరుపతి: ఎప్పుడూ ఎదొక విషయంతో వార్తల్లోకి వస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్స్ పేరు ప్రకటించి, ఆ పేరుతోనే సినిమా పై హైప్ క్రియేట్ చేయడం వర్మ స్టైల్‌. ఈ క్రమంలోనే ఇటీవల లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానంటూ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో వాస‍్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని తిరుమల వెంకన‍్న దర్శనం చేసుకున్నట్టుగా వెల్లడించారు వర్మ.

దీనిలో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార‍్వతితో కలిసి వర్మ శ్రీవారిని దర్శించుకున్నాడు. గురువారం కాణిపాకం సిద్ధివినాయకున్ని దర్శించుకున్న వర్మ.. ఈ రోజు కలియుగం దైవం వెంకన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. ‘దేవునిపై నమ్మకంతోనే స్వామి వారిని దర్శించుకున్నా. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో వాస్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని స్వామి వారికి మొక్కుకున్నా’ అని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతి శిల్పారామంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్టుగా తెలిపారు వర్మ.

గతంలో తాను నాస్తికుడినని చాలా సందర్భాల్లో చెప్పుకున్న వర్మ.. తాజాగా తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడం విశేషం. నాగార్జున హీరోగా తిరుమల ఆయళ నేపథ్యంలో గోవిందా గోవిందా చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ.. ఆ సమయంలో కూడా వెంకన్న దర్శనం చేసుకోలేదని తెలిపారు. మరి, ప్రస్తుత వర్మ తీరు చూస్తుంటే నిజంగానే నాస్తికత్వం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున‍్నాడా అనేది చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు