ఆర్ట్‌ డైరెక్షన్‌ టు డైరెక్షన్‌

16 Dec, 2018 01:31 IST|Sakshi
కార్తిక్, రాజేష్, అశోక్, ఆషా, రాజీవ్, యస్‌ .గోపాల్‌ రెడ్డి, రాఘవేంద్రరావు

మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా రిలీజైనప్పుడు అందులో వేసిన చార్మినార్‌ సెట్‌ గురించే మాట్లాడారు. ఆ సినిమాకి ఆ సెట్‌ కీలక పాత్ర వహించింది. ఇప్పుడెందుకు ఆ సెట్‌ గురించి అనుకుంటున్నారా! ఏమీ లేదు.. ఆ చిత్ర కళాదర్శకుడు అశోక్‌ కోరలత్‌  దర్శకునిగా మారారు.  ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్టం’. ఏ.కె మూవీస్‌ పతాకంపై ఆషా అశోక్‌ నిర్మిస్తున్నారు. కళా దర్శకునిగా భారత దేశంలోని అన్ని ముఖ్య భాషల్లో దాదాపు 150 పై చిలుకు చిత్రాలకు పని చేశారు అశోక్‌.

ఐదు నంది అవార్డులను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆయన దర్శకుడిగా మారి, తెరకెక్కించిన ‘ఇష్టం’లో రామ్‌కార్తీక్, పార్వతి అరుణ్‌ హీరో హీరోయిన్లు. సినిమా మొత్తం పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్‌. కె మాట్లాడుతూ– ‘‘ఇదో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. చిత్రంలోని ప్రేమకథ కూడా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఆడియోను, సినిమాను రిలీజు చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాం. విజయం అందుకుంటామన్న దీమా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : వివేక్‌ మహాదేవ.

మరిన్ని వార్తలు