ఆటా పాటా

15 Feb, 2020 01:23 IST|Sakshi
రామ్‌, మాళవికా శర్మ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ నటిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను కృష్ణా పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవికిషోర్‌ మాట్లాడుతూ–‘‘నేను... శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల తర్వాత రామ్‌–కిషోర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. సంగీత దర్శకుడు మణిశర్మ తొలిసారి మా సంస్థలో పని చేస్తున్నారు.

హైదరాబాద్, వైజాగ్, గోవా లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్స్‌తో టాకీ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్‌ లాంటి ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించే పనిలో ఉన్నాం. శోభి మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెల 20వరకు ఇటలీ షెడ్యూల్‌ జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి మరో పాటను చిత్రీకరిస్తే ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తవుతుంది. ఏప్రిల్‌ 9న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. రామ్‌ కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్‌’ చిత్రం తమిళ హిట్‌ ‘తడమ్‌’కు రీమేక్‌.

మరిన్ని వార్తలు