ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

20 Feb, 2015 02:57 IST|Sakshi
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల నివాళి
 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య ఇక్కడి ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియో ఆవరణలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన మృతికి గౌరవ సూచకంగా పోలీసులు మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పెద్ద కుమారుడు సురేశ్‌బాబు తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సందర్భంగా సురేశ్‌బాబు, చిన్నకుమారుడు హీరో వెంకటేశ్, మనువడు రాణా కన్నీరు మున్నీరయ్యారు.
 
 అంతకుముందు (గురువారం ఉదయం 10 గంటలకు) ఫిలింనగర్‌లోని నివాసం నుంచి రామానాయుడు భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం రామానాయుడు స్టూడియోకు తరలించారు. దారిపొడవునా అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడం ఒక దశలో పోలీసుల తరం కూడా కాలేదు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, దర్శకుడు కె. రాఘవేందరరావు, నటీనటులు అనీల్‌కపూర్, శ్రీదేవి-బోనీకపూర్, జయప్రద, కృష్ణ, విజయనిర్మల, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, సమంత, ప్రభాస్, విజయ్‌చందర్, తదితరులు రామానాయుడు పార్థివదేహానికి నివాళులర్పించారు.