రొటీన్ సినిమా వద్దంటున్న చెర్రీ!

21 Oct, 2015 11:01 IST|Sakshi
రొటీన్ సినిమా వద్దంటున్న చెర్రీ!

బ్రూస్ లీ సినిమా రిజల్ట్ తో నిరాశలో ఉన్న రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తనీ ఒరువన్ రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా హీరో, తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు మాత్రమే చేస్తున్న ఈ యంగ్ హీరో, తదుపరి సినిమాల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నాడు.

చరణ్ నెక్ట్స్ చేయబోయే తనీ ఒరువన్ రీమేక్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా, కోలీవుడ్లో ఘనవిజయం సాధించింది. జయం రవి హీరోగా, రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తనీ ఒరువన్ కథకు తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.

ఈ సినిమా తరువాత కూడా మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు చరణ్. గమ్యం, వేదం లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో, చరణ్ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న క్రిష్, ఆ సినిమా తరువాత చరణ్ సినిమా కోసం కథ రెడీ ఛాన్స్ కనిపిస్తుంది.