శ్రీరెడ్డి: ఫేస్‌బుక్‌లో స్పందించిన రాంచరణ్!

18 Apr, 2018 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి అనూహ్యంగా జనసేనే అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి.. అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శ్రీరెడ్డి విషయమై పవన్‌ స్పందిస్తూ.. ఆమె టీవీ చానెళ్లకు వెళ్లడం కంటే, పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. పవన్‌ను అన్నా అని పిలిచినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. అంతేకాకుండా పవన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య చేశారు.

పవన్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయిధరం తేజ్‌ పరోక్షంగా స్పందించారు. తాజాగా మరో మెగా హీరో రాంచరణ్‌ కూడా పరోక్షంగా మౌనాన్ని వీడారు. ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి’ అని ఫేస్‌బుక్‌లో సూచించారు. కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనమంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోను ఈ పోస్టుతోపాటు పెట్టారు. ‘నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది కలుగవచ్చు. కానీ వాటిని నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. నేను భరిస్తాను. మనం భరిద్దాం. ఎదురుదాడి చేయకుండా భరిద్దాం’ అంటూ వీడియోలో పవన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు