పాక్‌ ప్రధానికి వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌

21 Feb, 2019 08:47 IST|Sakshi

జమ్ము కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు నమ్మినప్పుడు ... మూడుసార్లు వివాహాలు చేసుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో అంటూ సెటైర్‌ వేశారు. రామ్‌గోపాల్‌ వర్మ ఇంగ్లీష్‌లో చేసిన ఈ ట్వీట్‌ను ప్రముఖ రచయిత కోన వెంకట్‌ తెలుగులో అనువదించి రీట్వీట్‌ చేశారు. 
 

'ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్‌తో మా వైపు పరిగెత్తుకొస్తున్నపుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మూగ భారతీయులకు కొంచెం మీ జ్ఞానాన్ని పంచండి. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు, మీ ట్యూషన్‌ టీచర్‌కు ఫీజు చెల్లిస్తాము. మీ దేశంలో ఎవరు(ఒసామా బిన్‌లాడెన్‌) నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ, మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారనేది మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఏదో మూగ భారతీయున్ని అడుగుతున్నాను సర్‌. దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్‌ చేయండి సర్‌. ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి కొడుతున్నారు, కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివి తేటలు నేర్పండి సర్‌' అని రామ్‌గోపాల్‌ వర్మ ఎద్దేవా చేశారు.
 


పుల్వామా ఉగ్రవాద దాడి కారణంగా ప్రస్తుతం భారత్‌–పాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)ను పాకిస్తాన్‌ కోరిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌ల మధ్య చర్చలకు చొరవ తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌కు విజ్ఞప్తి చేసింది. ‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భారత నేతలు డిమాండ్‌ చేస్తుండటాన్ని నేను భారతీయ టీవీ చానళ్లలో చూశాను. భారత్‌ ప్రతీకార దాడికి దిగితే మేం కూడా దాడి చేస్తాం. యుద్ధం మొదలుపెట్టడమే మన చేతుల్లో ఉంది. ఆపడం కాదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఇది పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వమనీ, ఉగ్రవాదులు తమకూ శత్రువులేననీ, తగిన సాక్ష్యాలు అందిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడికి పాకిస్తానే కారణమనేలా ఏదైనా ఆధారం ఉంటే భారత్‌ ఇవ్వాలనీ, చర్యలు తీసుకోదగ్గ సాక్ష్యాలను భారత్‌ సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్‌ చెప్పారు. అయితే 'స్వయంగా ఈ దాడికి పాల్ప డిన ఉగ్రవాది మాటలను, దాడి తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ప్రకటించడాన్ని ఇమ్రాన్‌ పక్కనబెట్టారు. జైషే సంస్థ పాకిస్తాన్‌ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తోందనీ, దాని చీఫ్‌ మసూద్‌ అజార్‌ పాక్‌లోనే ఉన్నాడన్న విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే. చర్యలు తీసుకోడానికి పాక్‌కు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి' అని భారత్‌ ప్రశ్నించింది. ఈ క్రమంలో వర్మ చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు