తొలిసారి నా బాస్‌ నన్ను గుర్తించారు : పూరీ

22 Jan, 2018 07:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ చూసి ఫిదా అయ్యారు. అంతేకాకుండా పూరి డైరెక్షన్‌లో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ పోకిరితో మెహబూబా చిత్రాన్ని కంపేర్‌ చేశారు. మెహబూబాతో పోల్చితే పోకిరి ఓ ఫ్లాప్‌ చిత్రం అంటూ తనదైన శైలిలో పూరీని పొగడ్తలతో ముంచెత్తారు. పూరీ తన కుమారుడి మీదున్న ప్రేమతో మెహబూబాను అత్యంత అద్భుతంగా తెరకెక్కించారని, ఓ అందమైన కావ్యంగా మలిచారని వర్మ ట్విట్‌ చేశారు. 'తొలిసారి నా బాస్‌ నన్ను ఓ ఫిల్మ్‌ మేకర్‌గా గుర్తించారు. నా జీవితంలోనే ఇదో పెద్ద కాంప్లిమెంట్‌, లవ్‌ యూ సర్‌' అంటూ పూరీ ట్వీట్టర్‌లో బదులిచ్చారు.

1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరీ తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు