ఆస్కార్‌పై రమ్యశ్రీ గురి!

15 Aug, 2013 01:27 IST|Sakshi
ఆస్కార్‌పై రమ్యశ్రీ గురి!
ఎన్నో భాషా చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించిన  రమ్యశ్రీ ‘ఓ మల్లి’తో దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. టైటిల్ రోల్‌ను కూడా  తనే పోషించారు. నేడు రమ్యశ్రీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలను పంచుకుంటూ -‘‘ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండే కమర్షియల్ సినిమా ఇది.
 
భర్తను ఎంతగానో ప్రేమించే మల్లి జీవితం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంది? అనేది కథాంశం. ఈ చిత్రాన్ని పలు ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలకు పంపించనున్నాను. అలాగే ‘ఆస్కార్’ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి కూడా పంపించబోతున్నాను. 
 
ఆస్కార్ ఎంతటి ప్రతిష్టాత్మక అవార్డో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నామినేషన్ పొందినా చాలు, అదే పెద్ద గౌరవం అనే విషయం తెలిసిందే. ఆస్కార్‌కి పంపించే అన్ని అర్హతలు సంపూర్ణంగా ఉన్న సినిమా కాబట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.