అరణ్య వాయిదా

17 Mar, 2020 00:26 IST|Sakshi
రానా

రానా హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో ‘కాడన్‌’ పేర్లతో రూపొందిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ‘‘ప్రేక్షకుల అభిరుచికి ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇదివరకెన్నడూ చెప్పని విలక్షణ కథలతో సినిమాలు నిర్మించడానికి, పంపిణీ చేయడానికి ప్రేక్షకులు మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్‌ చేస్తూనే ఉన్నారు.

కరోనా వైరస్‌కు సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మా సినిమా విడుదల తేదీని మార్చుతున్నాం. మా భాగస్వాములు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, మనందరి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ కోరుకుంటూ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘25 ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. ఈ చిత్రంలో పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలను చర్చించాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శంతను మొయిత్రా, కెమెరా: ఎ.ఆర్‌. అశోక్‌కుమార్‌. ఈ చిత్రానికి అసోసియేట్‌ ప్రొడ్యూ సర్‌: భావనా మౌనిక.

మరిన్ని వార్తలు