బాహుబలి కంటే గొప్పగా...

14 Dec, 2019 00:31 IST|Sakshi
రానా

రానా హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఈ విషయంపై రానా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ‘‘ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాం. ఇలాంటి సినిమాల్లో విజువల్స్‌ బాగుండాలని ఓ యాక్టర్‌గా నేను కోరుకుంటున్నాను. అందుకే సాంకేతికపై మరింత బాగా దృష్టి పెట్టాం.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్చువల్‌ రియాలిటీ సెట్స్‌ని క్రియేట్‌ చేయాలనుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల సినిమా మొదలు కాకముందే విజువల్స్‌ ఎలా ఉంటాయో ఓ అవగాహనకు రావొచ్చు. బహుశా.. ఇండియాలో ఇలా చేస్తున్నది మా టీమే అనుకుంటాను. ఇందుకోసం ఓ త్రీడీ స్కానింగ్‌ కంపెనీతో అసోసియేట్‌ కాబోతున్నాం. ఇంకా గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. మేం అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందు ప్రీ–ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాం. అంతా సమకూర్చుకున్న తర్వాత వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ‘హిరణ్య కశ్యప’ చిత్రాన్ని ‘బాహుబలి’ కంటే గొప్పగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు రానా.

మరిన్ని వార్తలు