‘దయచేసి పుకార్లను ప్రచారం చేయకండి’

4 Oct, 2018 10:54 IST|Sakshi
రిషి కపూర్‌ సోదరుడు రణ్‌ధీర్‌ కపూర్‌ (ఫైల్‌ ఫోటో)

వాస్తవాలు తెలియకుండా పుకార్లను ప్రచారం చేయోద్దంటూ అభ్యర్ధిస్తున్నారు రణ్‌దీర్‌ కపూర్‌. విషయం ఏంటంటే కొన్ని రోజులుగా రణధీర్ కపూర్ సోదరుడు, రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషి కపూర్‌ క్యాన్సర్‌ వ్యాధి బారిన పడ్డారని .. అది కూడా అడ్వాన్స్‌ స్టేజిలో బయటపడిందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రణ్‌ధీర్‌ కపూర్‌ అవాస్తవాలను ప్రచారం చేయోద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా సోదరుని అనారోగ్యం గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. తనకు ఎలాంటి వ్యాధి సోకిందో మా సోదరునికే తెలియదు. వ్యాధి నిర్ధారణకు సంబంధంచి ఇంకా ఎటువంటి పరీక్షలు కూడా ప్రారంభించలేదు. కానీ ఇంతలోనే రిషి కపూర్‌కి క్యాన్సర్‌.. అది కూడా చివరి దశలో ఉంది అంటూ పుకార్లను ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి మా మనోధైర్యాన్ని దెబ్బకొట్టకండి. మా సోదరున్ని ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చేలా సహకరించండి. టెస్ట్‌ల్లో ఎలాంటి  విషయాలు వెలుగులోకి వచ్చినా వాటిని ఎదుర్కొనేం‍దుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ తెలిపారు.

గత శనివారం రిషి కపూర్‌ తన భార్య నీతూ కపూర్‌, కుమారుడు రణ్‌బీర్‌తో కలిసి వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా రిషి కపూర్‌ తన శ్రేయోభిలాషులను అధైర్య పడవద్దంటూ.. వారి ప్రేమాభిమానాలు, ఆశీర్వాద బలం వల్ల తాను త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తానంటూ ట్వీట్‌ చేశారు. రిషి కపూర్‌ అమెరికా వెళ్లిన రెండు రోజులకే ఆయన తల్లి కృష్ణ రాజ్‌ కపూర్‌ మృతి చెందారు. దాంతో వారు ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక పోయారు.

మరిన్ని వార్తలు