మెగా ఫ్యాన్స్‌.. ఇంక పూనకాలే...

1 Mar, 2018 09:41 IST|Sakshi

సాక్షి, సినిమా : రంగస్థలం చిత్ర రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసేశారు. ఇప్పటికే తొలి సాంగ్‌ ఎంత సక్కగున్నవే ట్రెండ్‌లో కొనసాగుతుండగా.. ఇప్పుడు రెండో సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ ను మేకర్లు అధికారికంగా ప్రకటించేశారు. ‘రంగా.. రంగా.. రంగస్థలానా’... అంటూ సాంగ్‌ను మార్చి 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. 

ఈ మేరకు మేకర్లు ఓ చిన్న వీడియోను వదిలారు. అంతకు ముందు ముందుగా ఎంత సక్కగున్నావే పాటను లెజెండరీ తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్‌.. పాటను అంతగా ఆదరించినందుకు దర్శకుడు సుకుమార్‌, రైటర్‌ చంద్రబోస్‌లు శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపై మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌ సెకండ్‌ సాంగ్‌ రికార్డింగ్‌కు  సంబంధించిన దృశ్యాలను  చిన్న బైట్‌ రూపంలో విడుదల చేశారు.

గ్రామ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ సాంగ్‌లో చెర్రీ గెటప్‌ కూడా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు స్పష్టమౌతోంది. మొత్తానికి ఊర మాస్‌ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు దేవీ సిద్ధమైపోతున్నాడు. మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌, సమంత, జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు నటిస్తుండగా.. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు