సింధీ సంప్రదాయం ప్రకారం దీప్‌వీర్‌ వెడ్డింగ్‌..

7 Sep, 2018 13:01 IST|Sakshi

సాక్షి, ముంబై : ఈ ఏడాది నవంబర్‌లో వివాహ బంధంతో బాలీవుడ్‌ జంట రణవీర్‌సింగ్‌, దీపికా పడుకోన్‌లు ఒక్కటవనున్న క్రమంలో ఈ పెళ్లి తంతు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం మేరకు సింధీ వివాహానికి రణ్‌వీర్‌ కుటుంబ సభ్యులు మొగ్గుచూపుతున్నారు. సంప్రదాయ దుస్తులు, వంటకాలు, పద్ధతులను ప్రతిబింబిస్తూ ఈ వివాహాన్ని జరిపించాలని వారు భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులు పెండ్లి కుమారుడి వస్ర్తాలను చించే సంప్రదాయమైన సాంత్‌ కార్యక్రమం కూడా పెళ్లిలో భాగంగా ఉండాలని వారు కోరతున్నారు.

కాగా దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఈ ఏడాది నవంబర్‌లో ఇటలీలోని ఓ సుందర సరస్సు సమీపాన అత్యంత వేడుకగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వివాహ వేడుక గురించి ఇంతవరకూ దీపిక, రణ్‌వీర్‌లు అధికారికంగా నోరు మెదపకపోవడం గమనార్హం.

రణ్‌వీర్‌తో వివాహంపై దీపికా పడుకోన్‌ తెలివిగా దాటవేస్తూ త్వరలోనే ఈ విషయం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక ఇటలీలో జరిగే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేవలం బంధువులు, అత్యంత సన్నిహితులకే పరిమితం చేసిన దీపికా, రణ్‌వీర్‌లు ఇండియాకు తిరిగి రాగానే గ్రాండ్‌ రిసెప్షన్‌ను ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు