క్లైమాక్స్‌లో మనం మరణించబోవడం లేదు

14 Jun, 2019 16:16 IST|Sakshi

ముంబై: నిజ జీవితంలో దంపతులుగా మారిన తర్వాత బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె రీల్‌ లైఫ్‌లో తొలిసారి భార్యాభర్తలుగా నటించనున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘83’ సినిమాలో ఈ క్యూట్‌ జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. గతంలో వీరిద్దరు కలిసి పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ సినిమాలు వీరి ఇమేజ్‌ను తారస్థాయికి తీసుకువెళ్లాయి. ఈ సినిమాలు విషాద సన్నివేశాలతో ముగిసినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కాగా పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడం, కపిల్‌ బయోపిక్‌గా తెరకెక్కనుండటంతో ‘83’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు దీపికా సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కపిల్‌ భార్యగా రోమీ భాటియా పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు కబీర్‌ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీపికా పోస్టుకు స్పందించిన ఆమె భర్త రణ్‌వీర్‌..‘ ఈసారి క్లైమాక్స్‌లో మనం మరణించబోవడం లేదు. యాహూ’ అంటూ చమత్కరించాడు. కాగా 1983లో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌.. జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ .. 2020లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు