అటు సినిమాలు వరుసగా ఒప్పేసుకుంటూ ఇటు వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ మస్త్ క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా సందర్భంగా ఈ నెల 18 న ప్రారంభం కానుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కేయస్ రామారావు నిర్మించనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారని సమాచారం. అందులో ఒకరు ఇటీవలే ‘నవాబ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్యా రాజేశ్ అట. మరి మూడో హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.