డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు సారీ చెప్పిన రాశీ ఖన్నా

18 May, 2019 10:02 IST|Sakshi

తెలుగు‘టెంపర్‌’ రీమేక్‌ ‘అయోగ్య’ లో విశాల్‌కు జోడీగా రాశి ఖన్నా నటించగా, ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రంలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్‌ చెప్పారు. సినిమా క్రెడిట్స్‌లో తన పేరును చేర్చకపోవడంతో ట్విటర్‌ వేదికగా రవీనా తన బాధను వ్యక్తపరిచారు.

'అయోగ్య చిత్రం ముగిసాక వచ్చే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదు. అయినా షూటింగ్‌లో ఉన్న డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్‌ ఇంజినీర్లు, స్టూడియో కో-ఆర్డినేటర్‌ల పేర్లు క్రెడిట్స్‌లో పేర్కొన్నందుకు సంతోషంగా ఉంది. మా డబ్బింగ్‌ విభాగాన్ని మాత్రం చాలా సందర్భాల్లో పట్టించుకోనందుకు బాధగా ఉంది'అని రవీనా ట్వీట్‌లో పేర్కొన్నారు.


నన్ను క్షమించు రవీనా.. కానీ, నీ మధురమైన స్వరాన్ని అందించి నా పాత్రకు మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు. అంటూ రవీనా ట్వీట్‌కు రాశీ బదులిచ్చారు. దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు