‘నా గుండె ముక్కలైంది..మానవత్వం ఎక్కడుంది?’

19 Apr, 2019 19:59 IST|Sakshi

రాయ్‌చూర్‌ ఘటనపై సెలబ్రిటీల ఆవేదన

‘మానవత్వం ఎక్కడుంది. రాయ్‌చూర్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిపై పాశవికంగా అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన.. నా గుండెను బద్దలు చేసింది. ఇంకా ఎంతమంది ఇలాంటివి ఎదుర్కోవాలి? ఆమెకు న్యాయం జరగాలని, ఇదే చివరి ఘటన కావాలని ఆశిస్తున్నా’ అంటూ హీరోయిన్‌ రష్మిక మందాన్న సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాయ్‌చూర్‌ అడవిలో హత్యకు గురైన యువతికి న్యాయం జరగాలంటూ #JusticeForMadhu హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె చేసిన ట్వీట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. రాయ్‌చూర్‌ అడవిలో గత మంగళవారం ఓ యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడి .. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న జరిగిన ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలు మధుకు న్యాయం చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

ఇలాంటి వాటిని హైలెట్‌ చేయండి!
హీరో మంచు మనోజ్‌ కూడా ఈ ఘటనపై స్పందించాడు. ‘ ఒకరి కూతురు, సోదరి. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వార్తలకు ప్రాచుర్యం కల్పించేందుకు మీడియా తన శక్తిని ఉపయోగించాలి. ఈ విషయం గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయండి. మహిళలపై జరుగుతున్న ఈ భయంకరమైన ఘటనలను తక్కువగా చూపకండి. మధుకు న్యాయం జరగాలి’ అంటూ మీడియా ప్రతినిధులకు విఙ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు