మేం జీతగాళ్లం కాదుగా..

6 Feb, 2020 08:59 IST|Sakshi

సినిమా: నటి రష్మిక పేరు ఇప్పుడు దక్షిణాదిలో మారుమ్రోగిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ అమ్మడి కెరీర్‌ చాలా జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు ముంగిట వాలుతున్నాయి. పేరు, ఆదాయం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా రష్మిక పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఆదాయంపై కన్నేసిన ఆదాయ పన్నుశాఖ అధికారులకు సుమారు రూ.25 కోట్లు పట్టుబడినట్లు ప్రచారం జరిగింది. అలా స్థిర చరాస్తులు చాలానే కూడబెట్టినట్లు సమాచారం. ఇక నటిగా రష్మిక చాలా బిజీగా ఉంది. మాతృభాష కన్నడంలో, తెలుగులో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా నటుడు సూర్యతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ సినిమా రంగంలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే  స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడం అదృష్టమేనంది.

ఇక్కడ పలు కాలాలు నిలదొక్కుకోవాలంటే కఠినంగా శ్రమించాల్సి ఉంటుందని అంది. మన  ప్రతిభను చూసే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారు అని పేర్కొంది. తనకు కోపం ఎక్కువని, అయితే దాన్ని బయటకు వ్యక్తం చేయనని చెప్పింది. ఇంత చిన్న వయసులోనే నటిగా స్టార్‌ హోదా లభించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. తాను ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు అంటున్నారని, నటన కూడా ఒక ఉద్యోగమేనని అంది. ఉద్యోగం చేసే వారు ఒకసారి జీతం తీసుకుంటే ఆ తరువాత జీతం పెరగాలని ఎదురు చూస్తారంది. తానూ అంతేనని పేర్కొంది. అయితే తాము నెల నెలా జీతం తీసుకునే ఉద్యోగం చేయడం లేదని.. చిత్ర విజయాలను బట్టే తమ భవిష్యత్తు ఉంటుందని చెప్పింది. తాను సక్సెస్‌ కావడంతోనే నిర్మాతలు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారని పేర్కొంది. అర్హతకు తగ్గ పారితోషికాన్ని డిమాండ్‌ చేయడం అత్యాశ కాదని అంది. కాగా ఈ రంగంలోకి ఎందుకు వచ్చానని తానెప్పుడూ భావించింది లేదని నటి రష్మిక చెప్పుకొచ్చింది. మొత్తం మీద మాటల్లో బాగా ఆరితేరిందనిపించడం లేదూ! రష్మికానా మజాకా! కోలీవుడ్‌లో కూడా అదృష్టం బాగుంటే ఈ అమ్మడి జోరుకు పట్ట పగ్గాలుండవేమో. 

మరిన్ని వార్తలు