టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

7 Sep, 2019 10:43 IST|Sakshi

నటుడు విజయ్‌ సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ అయినా ఇతర అవకాశాలను కూడా పక్కన పెట్టేసి ఓకే చెప్పేస్తుంది కదూ.. అయితే రష్మిక అలాంటి లక్కీచాన్స్‌ను తిరస్కరించింది. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న న్యూస్‌. రష్మిక మందన్న.. ఈ పేరు మూడేళ్ల క్రితం పెద్దగా ఎవరికీ తెలియదు. కన్నడ నాట కిరాక్‌ పార్టీ అనే హిట్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్ర హీరోతో లవ్‌లో పడి, ఆ తరువాత బ్రేకప్‌ చేసుకుంది. ఇలాంటి వార్తలే రష్మిక గురించి ప్రచారం అయ్యాయి.

అలాంటిది తెలుగులో నటించిన గీతగోవిందం చిత్రం ఒక్కసారిగా రష్మికకు టాప్‌ ఇమేజ్‌ తీసుకొచ్చేసింది. అదే చిత్ర హీరో విజయ్‌దేవరకొండతో మరోసారి జతకట్టిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రం తమిళంలోనూ అనువాదం అవడంతో ఆ క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. దీంతో ఇక్కడ కార్తీతో నటించే అవకాశం రష్మిక తలుపులు తట్టింది.

అంతకు ముందు విజయ్‌తో నటించనుందనే ప్రచారం హోరెత్తింది. విజయ్‌ 64వ చిత్రంలో నటించే అవకాశం రష్మికను వరించింది. ప్రస్తుతం బిగిల్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్, లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తన 64వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. విజయ్‌కు జంటగా నటి రష్మిక నటిస్తే బాగుంటుందని భావించిన చిత్ర వర్గాలు ఆమెను సంప్రదించారని సమాచారం.

అయితే విజయ్‌తో నటించాలన్న ఆశ ఉన్నా, నటి రష్మిక ఆ అవకాశాన్ని నిరాకరించినట్లు తెలిసింది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి విజయ్‌ చిత్రానికి నో చెప్పినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. కాగా రష్మిక ప్రస్తుతం తెలుగులోనూ చాలా బిజీగా ఉంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తోంది. ఇక కొత్తగా హిందీ చిత్రంలోనూ నటించనుంది.

>
మరిన్ని వార్తలు