రొటీన్‌గా ఉండదు

23 Oct, 2018 01:48 IST|Sakshi
గీతానంద్

‘‘నేను పుట్టింది గుంటూరులో. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోని నానమ్మ వద్దే. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కథలు చెప్పడమంటే ఇంకా ఇష్టం. నాకు తోచిన విషయాలని స్నేహితులకు కథలుగా చెప్పేవాణ్ణి’’ అని హీరో గీతానంద్‌ అన్నారు. గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రథం’. వినోద్‌ సమర్పణలో రాజగురు ఫిలింస్‌ పతాకంపై రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గీతానంద్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు.

సినిమాలపై ఇష్టంతో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్, ‘నక్షత్ర’ అనే వెబ్‌ సిరీస్‌ చేశా. డైరెక్టర్‌గా అవకాశం రాకపోవడంతో నటనలో శిక్షణ తీసుకున్నా. నేను, చంద్రశేఖర్‌ కానూరి ఓ కథ అనుకున్నాం. ‘పంతం, తెలిసి తెలియక’ సినిమాలు ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత చంద్రశేఖర్‌ కానూరి ‘రథం’ కథ చెప్పారు. నిర్మాత రాజాగారు మాకు ఓ వెలుగులా తోడవడంతో ఈ సినిమా పూర్తయింది. ఈ చిత్రంలో నేను రైతుగా నటించా. అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో డీప్‌ రొమాన్స్‌ కథలో భాగంగానే ఉంటుంది. ఇది రొటీన్‌ సినిమాలా ఉండదు. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు