ఆ కష్టం అలవాటైపోయింది

6 Nov, 2018 00:25 IST|Sakshi
రవిబాబు

‘‘అదుగో’ సినిమా కోసం రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా. ఈ గ్యాప్‌లో చాలా అవకాశాలొచ్చినా చేయలేకపోయా. ప్రస్తుతం నన్ను అందరూ మరచిపోయారని కొందరు అంటున్నారు. ‘అదుగో’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశా’’ అని రవిబాబు అన్నారు. పంది పిల్ల (బంటి) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు చేశారు. నిర్మాత సురేశ్‌బాబు సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. రవిబాబు చెప్పిన విశేషాలు.

► డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఓ జంతువు లీడ్‌ రోల్‌లో సినిమా తీయాలనిపించింది. హాలీవుడ్‌ మూవీ ‘ప్లా నెట్‌ ఆఫ్‌ ఆది ఏప్స్‌’ సినిమా ఇష్టం. బడ్జెట్‌ దృష్ట్యా కోతులతో తెలుగులో సినిమా చేయడం సాధ్యం కాదు. ఏనుగు, ఈగ, ఎలుక, జీబ్రాతో పాటు అన్ని జంతువులతో మనవాళ్లు సినిమాలు చేశారు. పందితో హాలీవుడ్‌లో సినిమాలొచ్చాయి. కానీ, ఇండియాలో రాలేదు. అందుకే పందిని కథా వస్తువుగా ఎంచుకున్నా.

► పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పందిపిల్లకు ఒక రోజులో ఎదురైన సంఘటనలను వినోదాత్మకంగా చూపిం చాం. ప్రతి పాత్ర వినోదం పంచుతుంది. కమర్షియల్‌గా ‘అదుగో’ రిస్క్‌తో కూడుకున్నది. ప్రతిసారి కొత్త కథతో తొలి సినిమాలా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకురావడా నికి శ్రమిస్తుండటంతో ఆ కష్టం అలవాటైపోయింది.

► హాలీవుడ్‌లో జంతువులపై తీసే సినిమాలకు స్టార్స్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుంటారు. మన వద్ద ఆ సంస్కృతి లేదు. పంది పాత్రకు హీరోలతో డబ్బింగ్‌ చెప్పిస్తే ఫ్యాన్స్‌ నుంచి వ్యతిరేకత వస్తుందేమో? రాజేంద్రప్రసాద్‌గారిని అడిగితే బాగోదేమో అన్నారు. ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్‌ అవుతుందని ఒప్పించా.

► ‘అదుగో’ గ్రాఫిక్స్‌తో తీసిన సినిమాలా అనిపించదు. ప్రస్తుతం చాలా కథలు సిద్ధం చేసుకున్నా. ‘అదుగో’ సినిమాకి ప్రేక్షకుల స్పందన చూసి, మరో నాలుగు భాగాలు చేసే ఆలోచన ఉంది.

మరిన్ని వార్తలు