రివ కిషన్‌ డాటర్‌ ఆఫ్‌ రవికిషన్‌

31 Jan, 2019 01:58 IST|Sakshi
రివ కిషన్‌

మద్దాలి శివారెడ్డిగా అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు భోజ్‌పురి నటుడు రవికిషన్‌. ఆ తర్వాత ఆయన ‘కిక్‌ 2, సుప్రీమ్, రాధ, లై’ వంటి సినిమాలు చేశారు. అటు హిందీలోనూ పలు చిత్రాలు చేశారాయన. ఇప్పుడు ఆయన కుమార్తె రివ కిషన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. బాలీవుడ్‌లో నటి పద్మినీ కోల్హాపురి, నిర్మాత ప్రదీప్‌ శర్మల కుమారుడు ప్రియాంక్‌ ప్రదీప్‌ శర్మ ‘సబ్‌ కుశల్‌ మంగళ్‌’ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నారు.

ఈ సినిమాలోనే హీరోయిన్‌గా ఎంపికయ్యారు రివ కిషన్‌. ‘‘నేను హిందీ సినిమా చేయబోతున్నందుకు నాన్నగారు సంతోషంగా ఉన్నారు. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు రివ కిషన్‌. ప్రస్తుతం ఈ సినిమా వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు రివ అండ్‌ ప్రియాంక్‌. ఈ చిత్రం మార్చిలో జార్ఖండ్‌లో స్టార్ట్‌ కానుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో కరణ్‌ కశ్యప్‌ దర్శకునిగా పరిచయమవుతారు. ఇందులో నటుడు అక్షయ్‌ ఖన్నా ఓ కీలక పాత్ర చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు