మళ్లీ...జింతాత జిత జిత?

12 Dec, 2016 15:08 IST|Sakshi
మళ్లీ...జింతాత జిత జిత?

‘‘పోలీసోడికి ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళ్తాడు.. పోస్టాఫీసుకి కాదు’’ అంటూ పదేళ్ల కిందట వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అదే సినిమాలో ‘జింతాత జిత జిత జింతాత తా...’ డైలాగ్ కూడా చాలా పాపులర్ అయింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. ‘విక్రమార్కుడు’ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వినిపిస్తోంది. రచయిత విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం.

గత ఏడాది వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత రవితేజ ఇప్పటి వరకూ ఏ చిత్రం కమిట్ కాలేదు. మధ్యలో పలువురి దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ పట్టాలెక్కలేదు. రవితేజతో పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’కు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపించినా అదీ ఫైనల్ కాలేదు. లేట్ అయినా లేటెస్ట్‌గా ఓ మంచి పవర్‌ఫుల్ కథతో రావాలనే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు సమాచారం. అది ‘విక్రమార్కుడు’ సీక్వెల్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కి రాజమౌళి దగ్గర చేస్తున్న సహాయ దర్శకుల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట.